ప్రసిద్ధ బెంగాలీ రచయిత బిభూతి భూషణ్ బంధోపాధ్యాయ (1884-1950) రాసిన పథేర్ పాంచాలిని సత్యజిత్ రాయ్ సినిమాగా మలిచి ప్రపంచ ప్రసిద్ధం చేశాడు.
ఆ స్థాయిలో ప్రసిద్ధి చెందనప్పటికీ, బిభూతి భూషణ్ రాసిన మరో నవల ''అరణ్యక'' (1938) కూడా ఎంతో విశిష్టమైన రచన. దాన్ని సాహిత్య అకాడెమీ కోసం సూరంపూడి సీతారాం ''వనవాసి'' (1961) పేరిట తెలుగు చేశారు. ఎంతో కాలంగా ఆ పుస్తకం ప్రతులు ఎక్కడా దొరకడం లేదు. వనవాసి కథాంశం చాలా సరళం. కలకత్తాలో నిరుద్యోగిగా వున్న సత్యచరణ్ అనే యువకుడు అవినాశ్ అనే మిత్రుడి కోరిక మీద బీహార్లోని పూర్ణియా జిల్లాలో వున్న దాదాపు పదివేల ఎకరాల ఎస్టేట్ వ్యవహారాలు చూసే పనికి ఒప్పుకుంటాడు. నగరాన్ని వదిలిపెట్టి, ఆ అడవిలో దాదాపు ఆరేళ్లపాటు వుండిపోతాడు. అక్కడ అడవి నరికించి, భూమిని సాగులోకి తెచ్చి ఎస్టేటు ఆదాయం పెంచలవలసిన పని ఒకవైపూ, నెమ్మదిగా తనను లోబరుచుకున్న అడవి సౌందర్యం ముందు వివశుడైపోవడం మరొకవైపూ అతణ్ణి లాగుతుంటాయి. ఆ క్రమంలో దీన దరిద్ర భారతదేశ ముఖచిత్రమొకవైపూ, ప్రాచీన అరణ్య సీమల మహా సౌందర్యం మరొకవైపూ అతడికి సాక్షాత్కరిస్తాయి.