చరిత్ర, తత్వశాస్త్రాలను మార్క్సిస్టు దృక్పథంతో అధ్యయనం చేశారు. ఆంధ్రుల సంక్షిప్త చరిత్ర కాక భారతీయ తత్వశాస్త్రం, గతం - వర్తమానం - భవిష్యత్తు, ఉపనిషత్ చింతన, భారతీయ సంస్కృతి మొదలైనవి పుస్తక రూపంలో వచ్చిన వీరి ఇతర రచనలు. ఉపనిషత్ చింతన గ్రంథానికి తెలుగు విశ్వవిద్యాలయ పురస్కారం లభించింది. విశాలాంధ్ర, కమ్యూనిజం పత్రికలలో సాహిత్య, చారిత్రిక, తాత్విక సమస్యలపై అనేక వ్యాసాలు వ్రాశారు. బౌద్ధంలో గతి తర్కం పై వీరు ఇంగ్లీషులో వ్రాసిన వ్యాసం పీపుల్స్ పబ్లిషింగ్ హౌస్ ప్రచురించిన BUDDHISM పుస్తకంలో భాగం అయింది. లెనిన్ పై వ్రాసిన గ్రంథం సోవియట్ ల్యాండ్ ప్రచురణగా వచ్చింది. ఇవిగాక అనేక మార్క్సిస్టు సిద్ధాంత గ్రంథాలను తెలుగులో అనువదించారు. వీరు 1996 ఏప్రిల్ 3న మరణించారు.