"ఈ నవల ఒక కొత్త పద్ధతిని, భిన్నమైన ఇతివృత్తంలో రాశాను. చాలా రాష్ట్రాల సంస్కృతి, కులాల సంస్కృతి ఈ నవలలో అలలు, అలలుగా పాఠకుని ముందుకొస్తాయి. కథానాయకుడు ఒకడుండడు. చాలామంది పురుషులు, స్త్రీలు, తమ తమ కుల సంస్కృతులను ఒంటినిండా ఆరబోసుకొని పాఠకుని ముందుకొస్తారు. వలసవాదాన్ని తిట్టి, వలసవాద పద్ధతుల ననుసరించడం, కులమతాలను దాచి దేశ సంస్కృతిని పుస్తకాల్లో నుండి పుట్టించడం ఇందులో మచ్చుకైనా ఉండదు."
ఈ నవల రచయితగా నేను ఈ దేశపు మట్టి మనిషిని, బ్రహ్మతల మనిషిని కాదు. ఈ దేశ మట్టి నుండి వచ్చి మళ్ళీ మట్టిలోకే పోత. నేను బూడిదను కాను. ఆ మట్టి నుండి మళ్ళీ ఏమి పుడతాననేది ఈ నవల చెబుతుంది. నేను ఈ నవలలో కమ్యూనిజాన్ని శ్రీశ్రీ జగన్నాధుని రథచక్రాల్లా నడిపించలేదు. దాన్ని ఒక షెఫర్డ్ గొర్రెల్ని పచ్చిక బయలల్లో ఎలా తిప్పుతాడో అలా తిప్పాను. ఆ గొర్రెల్లోనే తోడేళ్ళు ఎలా దాగి ఉన్నాయో, ప్రేమ పేరుతో ఎన్ని కుల సంబంధాలను కాపాడుకుంటున్నాయో చూపించాను.
- కంచ ఐలయ్య