దేవ రహస్యం అనే పేరుతో వెలువడుతున్న ఈ గ్రంథం ప్రత్యక్షంగా మనం చూసే జగత్తునకు, మనం భావించి, నిర్మించుకున్న ఆధ్యాత్మిక జగత్తునకు నడుమ ఒక సంబంధాన్ని, ఒక ఆత్మీయతను, ఒక అనుస్యూతిని నిర్మించే ప్రయత్నం చేస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో పురాగాథలు వ్యాపించి ఉన్నాయి. ముఖ్యంగా మన భారతదేశంలో పురాగాథలు పురాణ ఇతిహాస రూపంలో వేల సంవత్సరాలుగా వ్యాప్తిలో ఉన్నాయి. పురాణ పురుషులు ఈ నేల మీదకు దిగివచ్చినట్టు, అవతార రుపాన్ని పొందినట్టు మనం విశ్వసిస్తున్నాం.
ఈ కాలంలో హేతువాదం కూడా కొన్ని పరిమితులకు లోబడి ఒక మూఢ విశ్వాసంగా మారిపోయి చాలా విలువైన జీవన పార్శ్వాలను అసత్యాలని తోసిరాజంటున్నది. ఈ సందర్భంలో ఈ పురాణ గాథలను చారిత్రక ఆధారల మీదుగా పురాతన శిథిలాల మీదుగా సముద్ర గర్భాల్లో లభించిన అవశేషాల మీదుగా సత్యాలను నిరూపించే ప్రయత్నం జరిగింది. ఈ ప్రయత్నం ఈనాటి పాఠకుడిని, విశ్వాసం వైపు కొంతవరకు పయనింపజేస్తుంది. పురాగాథల్ని చర్చించే సందర్భంలో పేజర్ ''ది గోల్డెన్బో'' అనే గ్రంథలో ప్రపంచవ్యాప్త పురాగాథలలోని నమూనాంశాలు పేర్చి చూపెట్టడం జరిగింది. ఇక్కడ ఈ గ్రంథంలో రచయిత ఆధునిక శాస్త్రీయ అంశాల ఆధారంగా పురాగాథాంశాలను నిజాలుగా నిశ్చయించే ప్రయత్నం చేశాడు.
దేవ రహస్యం అనే ఈ గ్రంథంలో దృశ్యమాధ్యమానికి అనుకూలంగా నిర్మింపబడ్డది. దీనిని పాఠకులు తమకు తాము తెలియకుండానే వక్తవ్యాన్ని అంగీకరించే దశలోకి చేరుకుంటారు. ఒక సమ్మోహన స్థితిలో సామాన్యులు ఇంద్రియ ద్వారాల నుండి సాగిపోతూ అతీంద్రియ స్థాయికి చేరుకుంటారు. - కోవెల సుప్రసన్నాచార్య