ALL CATEGORIES

  కోల్పోయిన, పరిహరింపబడిన, కాలుష్యానికి గురైన స్వేచ్చనుతిరిగి పొందటంలో భాగంగా తనని తానూ స్వచ్చ  పరచుకోవటం, స్వస్థత పొందటం అనే భారం దిగంబర కవిత మోయక తప్పలేదు.  ఈ భారాన్ని మోయటమనే విషయంలో దిగంబరులు గుండె దిటపు గొప్పది. ఈ క్రమంలో దిగంబరులు కీర్తిని, అపకీర్తిని సరిసమానంగానే పొందారు. ఏ సామాజిక, సాహిత్య ఉద్యమమైనా ప్రజా బాహుళ్యాన్ని కదిలించటానికి మూడు పనులు తప్పనిసరిగా చేయాల్సి ఉంటుంది. అవి భావాలను సరళీకరించటం, సత్యాన్ని ఆవిష్కరించటం, ఈ రెండిటి కలయికతో నిబద్దతో కూడిన ఆచరణను ఆశించటం. దిగంబరులు ఆశించింది, ఆకాంక్షించింది ఇదే కదా!

చితిపేర్చుకుందాం:

ఏయ్! సఖీ!!

నిన్నే ముసుగులు తన్నెయ్

వెయ్యేండ్ల కలల తత్వంతో

వేసారిపోతున్న నీకు

క్షణం గ్యారంటీలేని

జీవితం మిగిల్చేదేమిటి?

నిన్నేనోయ్ ఎదగని మనిషీ!

రేబవళ్ళ తిరుగాలి మధ్య

నామరూప రహితుడవై

ఎప్పుడో గప్పున గాలిలో కలిసేముందు

ఒక్కసారి వెనక్కి మళ్ళీ చూసుకోవూ?

వెన్నెల నీ కన్నుల్లో ఇంకి

చుక్కలు నీ చూపుల్లో చిక్కి

కన్నీటిని దూరం చేస్తాయీ?

అందమైన ఆడదాన్ని వెతికి తెచ్చి

ఊపిరాడని గదిలో బంధించి

వోయ్యారపు ఊహల పల్లకీలో ఊరేగించి

పాదాలు పట్టుక వేలాడే కవీ!

కోలుకుంటా వెప్పుడు నీ తరతరాల వ్యాధి?

జాతిని జాగృతం చేసే

చైతన్య పుంస్కోకిలల కంఠాలమధురం

జావలా జారి జారి

ముసలి దాని ముద్దులోని తీపిలాగుందని

మహాశయా పాఠకుడా

మనస్సెప్పుడేని మళ్ళించావూ?

నీవు నేనూ ఓటుతో పోటీపడి

నిర్మించుకున్న గూడు

అదే చూడు

పుల్ల మీద పుల్ల

పైనించి చూస్తే కనిపిస్తుంది నేల

సిగ్గెందుకు లేదోయ్ రాజకీయవాదీ?

ఈ మహా పాపంలో

మనమంతా భాగస్థులం

రాగల యుగాల కొరకు

అణువణువును చిదిమి చిదిమి

చైతన్యాగ్ని జ్వాలాముఖులమై

చితి పేర్చుకుందాం రండి.