విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు తప్పక చదివి తెలుసుకోవలసిన విషయాలు ఈ సంపుటిలో ఉన్నాయి. ఋషివేలి, రాజఘాట్ (వారణాశి) విద్యాలయాల్లో అధ్యాపకులతో, విద్యార్థులతో కృష్ణమూర్తి జరిపిన సంభాషణలు, అక్కడ ఇచ్చిన ప్రసంగాలతో కూర్చిన సంకలనం ఇది. పిల్లలో సర్వతోముఖమైన వికాసం కలిగించేదే సరియైన, సమగ్రమైన చదువు. చరిత్ర, భూగోళము, లెక్కలు, సైన్సు వంటి విషయాలను పాఠాలుగా నేర్పడంతోనే విద్యావేత్తల బాధ్యత పూర్తి అవదు. ఒక విభిన్నమైన, కల్మషరహితమైన సమాజాన్ని నిర్మించే నవ్యమానసం విద్యార్థులలో ఉద్భవించాలి. వారిలో సృజనశీలత, దయ, ప్రేమ, కారుణ్యం, ప్రకృతి - పరిసరాల ఎడల శ్రద్ధ మేల్కొల్పడానికి మన చదువులూ, ఉపాధ్యాఉలూ తోడ్పడాలి. మనిషి చేతనలో శాస్త్రవిజ్ఞానము, ఆధ్యాత్మిక చింతన ఒక సమరసపూరితమైన ఏకస్రవంతిలా ఉన్నప్పుడే ప్రపంచంలో శాంతిభద్రతలు నెలకొంటాయని కృష్ణమూర్తి నొక్కి చెప్తున్నారు. బాహ్య ప్రపంచాన్ని అంటే బయట జరుగుతున్న విషయాలను, తన అంతరంగంలో నిరంతరం చలిస్తున్న ఆలోచనలను ప్రతి మనిషీ పరిశీలిస్తూ అర్థం చేసుకోవడం అవసరం. చిన్న వయసు నుండే ఇది పిల్లలకు బోధించాలి. అప్పుడే వారు ఆరోగ్యంగా, ఆనందంగా వుండి, వారి జీవితాలు సంపూర్ణతతో, సాఫల్యతతో ప్రపుల్లమవుతాయని కృష్ణమూర్తి గాఢంగా విశ్వసిస్తున్నారు.
పేజీలు : 176