బ్రిటీషువారు తమ విలాసాల కోసం, తమ సైనికుల విలాసాల కోసం హిమాలయ పర్వతాలలోని శీతల మంద సుగంధ పవనాలు వీచే పచ్చని ప్రదేశాలను ఎంపిక చేసుకునేవారు. ఆ ప్రాంతాలలో ఉండే వెనుకబడిన జాతుల ప్రజల జీవనాలను ధ్వంసించేవారు. విలాస నగరాలకు వచ్చే విలాస ప్రియులు సహజ సౌందర్యవంతులైన అక్కడి స్త్రీల జీవితాలను నరకప్రాయం చేసేవారు. అదేవిధంగా ఈనాటి ప్రభుత్వాలు టూరిజం పేరు మీద అలాగే స్వదేశీ, విదేశీ పెట్టుబడిదారుల అవసరాలకు అనుగుణంగా మారుస్తున్నారు. అణగారిన పేద, బడుగు, బలహీన గిరిజన జాతుల ప్రజల జీవనానిన& ఛిద్రం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే 40 సంవత్సరాల క్రితం రాహుల్ సాంకృత్యాయన్ హిందీలో రాసిన ''బహురంగీ మధుపురి'' కథల సంపుటిని ''మధుపురి'' అనే పేరుమీద తెలుగులోకి అనువదించి చారిత్రక, రాజకీయ అంశాల పట్ల ఆసక్తి మెండుగా ఉండే తెలుగు పాఠకుల ముందుకు తీసుకువస్తున్నాం. రాహుల్జీ గ్రంథాలు ఆంధ్రదేశంలో బహుళ ప్రాచుర్యం పొందాయి. ఈ కథల సంపుటి కూడా ఆ విధంగానే తెలుగు ప్రజల మనోభావాల్లో విహరించగలదు.