'సరస్వతీ! స్త్రీ గానీ, పురుషుడుగానీ, వివాహిత గానీ, అవివాహిత గానీ, ఆనందంగా వుండటానికి కావలసిది 'ప్రేమించిన మనిషి' లేకపోవటం కాదు. తనకు ప్రేమించే హృదయం లేకపోవటం''.
భర్త మాటలు అర్ధంకానట్టు సరస్వతి తనలో తానే కొంచెం సేపు తర్కించుకుని చివరికి ''నాధా! ప్రేమంటే ఏమిటి ?'' అని అడిగింది.
నారదుడు కంగారుగా 'నారాయణ.... నారాయణ' అన్నాడు. బ్రహ్మ చిరునవ్వుతో ''వాగ్దేవేనా ఈ ప్రశ్న అడుగుతున్నది ?'' అన్నాడు.
''అందులో హాస్యాన్ని పట్టించుకోకండి. ప్రేమికుడు లేకపోవటానికి, ప్రేమించే హృదయం లేకపోవటానికి తేడా ఏమిటి ?'' అంది.
''ప్రేమంటే ఆహ్లాదం. అది స్త్రీ పురుష సంపర్కమే కానవసరం లేదు.''
ఆ మాటలకి సరస్వతి మరింత అయోమయంగా భర్తవైపు చూస్తూ 'మీ నాలుగు తలల తార్కిక జ్ఞానంతో నా ఒక్క మెదడునీ అతలాకుతలం చేస్తున్నారు స్వామీ' అంది.
''అయితే నీవే చూడు దేవీ'' - సరస్వతి చూసిన ఆమె పేరు వేదసంహిత! వైవాహిక జీవితం ఆమె మెడమీద భర్త పెట్టిన కత్తిగాటునే మిగిల్చింది.
బ్రతుకు బాటలో ముందుకు సాగిపోయే తరుణంలో - ఆలంబనగా ఒక అనుభవాన్నీ, అనుభూతినీ మిగుల్చుకోవాలనుకుంది. ఆమె జీవితంలోకి అభిషేక్ అపురూపంగా ప్రవేశించాడు. వెన్నెల్లో గోదావరి ఒడ్డున ఒక అనుభవం అనుభూతిగా మారింది.
ప్రతి పదమూ సరిగమ పదముగా - ప్రతి వాక్యమూ ఒక సరళీ స్వరముగా - ప్రతి ఉపమానమూ అపురూపముగా యండమూరి వీరేంద్రనాథ్ స్వరకల్పన చేసిన మృదుమధుర మంజుల నవలా నాదం 'ప్రేమ'.