ALL CATEGORIES

ఏమిట్రా అంత దీక్షగా చదువుతున్నావ్‌ ?' గ్లాసులో మందుపోస్తూ ఒకడు రెండో వాడిని అడిగాడు. పచ్చి మిరపకాయల బజ్జీల పొట్లం విప్పి, బజ్జీల్ని ప్లేట్లో పడేసి, కాగితం పారెయ్యబోతూ ఆగి దాన్ని చదువుతున్న రెండో వాడు తలెత్తి ''ఇదేదో ఇంటరెస్టింగుగా వుందిరా, డైరీలో కాగితంలా వుంది' అన్నాడు. ఎప్పటిదో పాత డైరీలో కాగితం. 'ఇదేదో ఆడపిల్ల డైరీలో కాగితంలా వుంది. క్రింద శారద అని వుంది'. మూడోవాడు ఆ కాగితాన్ని లాక్కుని బిగ్గరగా చదవడం ప్రారంభించాడు. 'మనుష్యులు రెండు రకాలు. తెలివైనవాళ్ళు. తెలివితక్కువ వాళ్ళు - మనుష్యులు రెండు రకాలు. బలమున్న వాళ్ళు. బలం లేని వాళ్ళు - తెలివిగానీ బలముగానీ లేనివాళ్ళు సామాన్యులౌతారు - బలం వున్నవాడు నీతిని వదిలేస్తే పొలిటీషియన్‌ అవుతాడు - తెలివి వున్నవాడు నీతిని వదిలేస్తే కాపిటలిస్టు అవుతాడు - తెలివైన వాడు నీతిని వదిలెయ్యకపోతే టీచరో మేధావో అయిసంతృప్తి పడతాడు - బలమైన వాడు నీతిని వదిలెయ్యకపోతే శ్రామికుడై శక్తిని ధారపోస్తాడు - నా జీవితాన్ని దర్పణంగా చేసి, నలభై సంవత్సరాల చరిత్రని అందులో ప్రతిబింబంగా చేసి చూస్తే నాకు తెలిసిన సత్యం ఇది. ఎందుకో ఈ రాత్రి నా జీవితంలో ఆఖరిరోజు అనిపిస్తుంది. ఇదే నా డైరీలో ఆఖరిపేజీ అనిపిస్తుంది - శారద''. రెండు విభిన్నలోకరీతుల్ని రెండు విభిన్న కోణాల్లో యండమూరి వీరేంద్రనాథ్‌ వివరించిన విలక్షణమైన నవల 'ది డైరీ ఆఫ్‌ మిసెస్‌ శారద'.