సాహిత్య ప్రక్రియల్లో కవితలు, కథలు, నవలలూ, నాటకాల గురించి ప్రస్తావిస్తారు గానీ సంగీతాన్ని ప్రస్తావించరు. సంగీతానికి స్వయం ప్రతి పత్తి వుండటం దీనికి కారణమై వుండవచ్చు. కానీ సాహిత్యం లేనిదే సంగీతం లేదు. సంగీతానికీ సాహిత్యానికీ అవినాభావ సంబంధం, శాస్త్రీయ సంగీతమంటే భక్తి ప్రాధాన్యమే. త్యాగరాజు, పురందరదాసు, రామదాసు, శ్యామశాస్త్రి గార్ల కీర్తనలు స్వరరాగ బద్ధమై, తాళజతిగతులతో, రాగాల్లో ఇమిడే గమకాలతో పాడుకునే సాహిత్యం. కానీ పామరజనరంజకంగా, రాగచ్ఛాయల్లో, భావ ప్రాధాన్యంగా అనుభూతిని సంతరించుకున్నవి - లలిత గీతాలు. ఇలాంటి పాటలు రాయడానికి భాషలో పాండిత్యం అవసరం లేదు, దానిలోని లాలిత్యం తెలిస్తే చాలు. చిన్నపువ్వునో, చిగురునో, వానచినుకునో చూసి పరవశించే మనసు కావాలి. అలా ఉన్నప్పుడు, ఆ పరవశంలోనే భావాలు చిమ్ముకుని వస్తాయి. వాటంతట అవే అందంగా రాగాల్లో ఒదిగిపోతాయి. లలితగీతాలౌతాయి. నాగలక్ష్మి ''వానచినుకుల్లో'' పైన చెప్పినవన్నీ పుష్కళంగా ఉన్నాయనిపించింది. - భార్గవీరావు