భారత దేశ స్వాతంత్ర పోరాటంలోనూ ఆ తర్వాత కూడా ఎందరో గొప్ప నేతలు వున్నా, దాన్నే పేరుగా నిలుపుకున్న ధీమంతుడు సుభాస్ చంద్రబోస్ మాత్రమే. గాంధీజీ, నెహ్రూజీ, నేతాజీ, ఆ పక్కన భగత్సింగ్ - ఈ నాలుగు ఫోటోలు ప్రతి భారతీయ గృహంలో దర్శనమిస్తుండేవి. స్వాతంత్ర పోరాటంలోనూ కాంగ్రెస్ నాయకత్వంలోనూ గాంధీజీ నాయకత్వాన్ని ధిక్కరించి నిలదొక్కుకున్న నేత ఆయన ఒక్కరే. తన తండ్రి వత్తిడిపై పరీక్ష రాసినందుకు బ్రిటీష్ ప్రభుత్వంలో ప్రతిష్టాత్మకమైన ఐసీఎస్లో నాల్గవ ర్యాంకర్గా వచ్చినా ఆ హోదా స్వీకరించకుండానే వదులుకుని స్వాతంత్ర పోరాటంలో దూకారు. గాంధీజీతో విభేధించి అభ్యుదయ వాదుల మద్ధతుతో కాంగ్రెస్ అద్యక్ష పదవికి పోటీ చేసి గెలిచారు. ఆ విధంగా నేతాజీ భారత స్వాతంత్ర పోరాట నాయక త్రయంలో ఒకరుగా ప్రసిద్ధి కెక్కడమే గాక సమాంతర స్ధానాన్ని సంపాదించుకున్నారు. ఇలాటి విశిష్టత బహుశా మరెవరికీ లేదు. జైలు శిక్షలూ నిర్బంధాలు అనుభవించారు. నలభయ్యవ దశకం ప్రారంభంలో హిట్లర్ నాయకత్వంలోని నాటి నాజీ జర్మనీ సహాయంతో భారత దేశాన్ని విముక్తి చేయవచ్చునని భావించి దేశం నుంచి తప్పించుకుని వెళ్ళిపోయారు. అంతకు ముందే జపాన్ సహాయంతో ఏర్పడిన ఇండియన్ నేషనల్ ఆర్మీ (ఐఎన్ఏ) లేదా ఆజాద్ హింద్ ఫౌజ్ను పునరుద్ధరించి నూతన శక్తినిచ్చి దేశంపైకి తరలించారు. ఈ సమయంలో విమాన ప్రమాదంలో మరణించడం దేశాన్ని విషాదంలో ముంచింది....
భారత స్వాతంత్య్ర పోరాట చరిత్రలోని అత్యంత క్లిష్టమైన దశ గురించీ, ఆ సమయంలో సుభాస్ చంద్రబోస్ నిర్వహించిన పాత్ర గురించీ, యువకులు, విద్యార్ధులు, సాధారణ పాఠకులు చక్కగా అవగాహన చేసుకోవడానికి యీ పుస్తకం దోహదపడుతుంది.