పశ్చిమ తమిళనాడులో నమక్కాల్ జిల్లా తిరుచెంగోడు పట్టణ ప్రాంతంలోని ఒక సామాజిక సంప్రదాయం ఈ నవలకు నేపథ్యం. దాన్ని ఆచార్య పెరుమాళ్ మురుగన్ తమిళంలో 'మధోరు బాగన్' అనే నవలగా 2010లో రాశాడు. దాని తెలుగు అనువాదమే 'అర్ధనారీశ్వరుడు''. 1940 సం|| నేపథ్యంలో వ్యవసాయము, పశుపోషణ జీవనంగా గల ఒక జంట కాళి, పొన్నల కథ ఇది. ఎన్ని ''గుళ్ళూ, గోపురాలు దర్శించినా'' సంతానం కలగదు. పిల్లలు కలగనపుడు తిరుచెంగోడు అర్ధనారీశ్వరుడికి జరిగే రథోత్సవం వేడుకల్లో 14వ రోజున సాంఘిక కట్టుబాట్లను వదలి, ఆ రాత్రి ఎవరు ఎవరితోనైనా శృంగారంలో పాల్గొని పిల్లల్ని కనవచ్చుననే సాంప్రదాయం ఆనాడు ఉండేది. దీని నాధారంగా చేసుకొని హృద్యంగా ఈ నవల రచించబడింది. పశ్చిమ తమిళనాడులోని కొగునాడు ప్రాంతంలోని కొన్ని సామాజిక వర్గాలు మురుగన్ మీద కాలు దువ్వినాయి. అలజడి ప్రారంభమయింది. ఈ నవలలో ప్రస్తావించిన అంశాలు తమ సామాజిక వర్గాన్ని, స్త్రీలను కించపరచేవిగా ఉన్నదనీ, దీన్ని నిషేధించాలనీ కొన్ని హిందూ మతోన్మాద సంస్థలూ, కుల సంఘాలు వక్రమార్గంలో ఎడతెరిపి లేని ఆందోళన అన్ని రూపాల్లో కొనసాగించాయి. రచయితైన మురుగన్ను వేటాడారు. దాదాపుగా సాంఘిక బహిష్కరణ చేశారు. మురుగన్తో ప్రభుత్వ అధికారుల సమక్షంలో క్షమాపణలు చెప్పించాయి. అయినా గొడవ కోర్టుదాకా వెళ్ళింది. విచారణ సం||ర కాలం జరిగింది. మతోన్మాదుల ఉన్నాదాన్ని కోర్టు కొట్టివేసింది. ఈ రచనను తెలుగులోకి ప్రసిద్ధ రచయిత ఎల్.ఆర్.స్వామి అనువదించారు