అప్పల్నాయుడు గత ముప్పై అయిదేళ్లుగా కథలు రాస్తున్నాడు. విద్యార్థి దశలోనే నాటక సంస్థను స్థాపించి నాటకాలు వేయించడమే కాకుండా, జననాట్యమండలిలో తానొక కళాకారుడిగా పాల్గొని నాటక ప్రక్రియలో అభినివేశం పొంది, నాటక రచనా ప్రక్రియను కూడా కథా రచనకు సమాంతరంగా కొనసాగిస్తూ "మడిసెక్క" నాటకం రాసి ప్రదర్శింపజేశాడు. ఇది అన్ని భారతీయ భాషల్లోకి అనువదించబడే ఉన్నత స్థాయి గుర్తింపు పొందింది. తరువాత రేడియో కోసం శ్రావ్య నాటకాలు కూడా రూపొందించాడు. ఇరవయ్యోశతాబ్దం మనకందించిన గొప్ప కళారూపం నవల. ఇటువంటి నవలా ప్రక్రియను కూడా అప్పల్నాయుడు "పునరావాసం" నవలతో ఆరంభించాడు.
ఇక్కడ జరిగిన మహత్తర గిరిజన రైతాంగ పోరాటం, దాని వైఫల్యం తర్వాత కూడా వారిలో జ్వాజ్వల్యమానంగా కొనసాగుతున్న చైతన్య దీప్తిపై నీళ్ళు జల్లే కార్యక్రమం, ఈ నవలకు "సారం". ఈ ప్రక్రియలో కూడా కొనసాగే దోపిడీనీ, లోసుగుల్ని ఈ నవల అంతరేక్షణతో విశ్లేషిస్తుంది. ఈ క్రమంలో చరిత్ర కధనాలు, న్యాయవ్యవస్థ రాజ్యవ్యవస్తలలోని డొల్లతనాన్ని లేకితనాన్ని ఎండగడుతూ మరో మూడు నవలల్ని కూడా రాశాడు. వీటితో సహా నడుస్తున్న చరిత్రకు అద్దంపట్టే "నేస్తం ఊసులు" వంటి కాలమ్ ను నిర్వహించిన మంచి కాలమిస్ట్ గా కూడా అప్పల్నాయుడు ప్రసిద్ధుడు.