హిమాచల శిఖరాల వలె, గంగాయమునా నదుల వలె శాశ్వతత్వం పొందిన ఉత్తమ సాహిత్య స్రష్టల్లో అడివి బాపిరాజు గారు అగ్రశ్రేణిలోని వారు. బాపిరాజు గారిది విశిష్ట వ్యక్తిత్వం. త్రివేణి సంగమం వలె, సంగీత, సాహిత్య, చిత్రలేఖనాలు బాపిరాజుగారిలో కలిసిపోయాయి. కవిసామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారు బాపిరాజు గారిని గురించి చెప్పిన పంక్తులు కొన్ని చదివితే చాలు బాపిరాజు గారి వ్యక్తిత్వం అర్ధమవుతుంది.
''అతడు గీసిన గీత బొమ్మైఅతడు పలికిన పలుకు పాటై
అతని హృదయములోని మొత్తన అర్ధవత్కృతియై
అతడు చూపిన చూపు మెఱుపై
అతడు తలచిన తలపు వెలుగై
అతని జీవికలోని తియ్యని
అమృత రసధునియై''
ఈ పంక్తులు బాపిరాజు గారి హృదయ స్వరూపాన్ని మన కన్నుల ముందు నిలబెడతాయి. ''హృదయములోని మెత్తన'' జీవికలోని తియ్యన'' ఈ రెండు మహాగుణాలు బాపిరాజుగారిని మహా మానవునిగా తీర్చిదిద్దాయి.
ఆయన బహుముఖ ప్రజ్ఞాశాలి. ఏ నవలైనా తీసుకుని చదివితే ఆయనకు ఎన్నెన్ని విషయాలు తెలుసో అర్ధమవుతుంది. తలస్పర్శిగా తెలిసిన వ్యక్తి ఆయన.
సాహితీ హిమాలయోత్తుంగ శృంగం శ్రీ అడివి బాపిరాజు గారి చారిత్రాత్మక నవల హిమబిందు.