హిందీ సాహిత్యంలో సుప్రసిద్ధ నవలా రచయిత అమృత్ లాల్ నాగర్ కు ఒక విశిష్టమైన స్థానమున్నది. మౌలికమైన ప్రతిభాసంపన్నుడిగా నాగర్ తమ నవలల్లో అనుభూతి ప్రధానమైన వాతావరణాన్ని అల్లుతారు. పాత్రల మానసిక అగాదాల్లోకి చొచ్చుకుపోతారు. వ్యంగ్య ప్రధానమైన శైలిలో దేశకాల పరిస్థితులకు అద్దం పడతారు. అలాగే వస్తుపరంగా ఇతివృత్తాన్ని అనుసరించి తమ శైలీ సంవిధానాన్ని రూపొందించుకుంటారు. నాగర్ సమకాలీన సమస్యలను, సామాజికపరమైన ఇతివృత్తాలను తీసుకొని సజీవమైన హిందీ నవలలు రచించారు.
వారు రచించిన నవలల్లో బాగా పేరు తెచ్చుకున్నవి - నవాబీ మసనద్, మహాకాల్, బూంద్ ఔర్ సముద్ర, నాచ్యో బహుత్ గోపాల్, మానస్ కాహాన్స్ - మొదలైనవి. ఈ నవలల్లో మధ్య తరగతి, బడుగు జీవితాల గురించి ఆయన శక్తివంతంగా చిత్రించారు. పల్లె జీవితాల గురించి కూడా నాగర్ రచనలు చేశారు. భారతీయ సంస్కృతికి ఉన్న మౌలిక పునాదులను ఆయన విస్మరించలేదు. జైన బౌద్ధ మతాల ప్రభావం ఉన్న ఈ రోజుల్లో సాంఘిక పరిణామాలు, ఆచార వ్యవహారాలను ఈ నవల ప్రతిబింబిస్తున్నది.