పాశ్చాత్య కవితా ఝరిని తెలుగు సాహితీ క్షేత్రానికి తీసుకురావాలన్న ప్రయత్నంలో 'పడమటి కోయిల పల్లవి'కి 'తీయ తెనుగు అను పల్లవి' జత కూర్చి శ్రీ యండమూరి వీరేంద్రనాథ్ సారధిగా కట్టిన కవితా వారధి ఈ పుస్తకం.
కీట్స్, వర్డ్స్వర్త్, కోలరిడ్జ్, డన్మోర్, ఈట్స్ లాంటి కవుల కవితల్లో అంతర్లీనంగా ఉన్న భావం చాలా అద్భుతంగా వుంటుంది. ఇవన్నీ నారికేళ పాకాలు. మామూలుగా చదివితే అంతగా ఆకట్టుకోవు. లోతుగా వెళ్ళి పరిశీలించాలి. ముఖ్యంగా 'ప్రాఫెట్' అయితే ప్రతి వాక్యమూ ఆణిముత్యమే.
'పిల్లల్ని ప్రేమించే ప్రయత్నం తప్పుకాదు. వారు తిరిగి ప్రేమను ఇవ్వాలన్న నిబంధనే మహాపాపం'. (ప్రాఫెట్)
మనిషి జీవితపు విందులో పంచభక్ష్య పరమాన్నాలన్నీ వడ్డించబడతాయి. చివర - మృత్యువు వాటిని తుడిచి పెట్టుకు పోతుంది (రిచర్డ్ బ్రాన్ ఫీల్డ్)
అనుభవం శయ్యమీద కలిసిన రెండు శరీరాలు. మనసు మాత్రం నీది నీదే- నాది నాదే (డి.హెచ్.లారెన్స్)
ఇలాంటి గొప్ప భావాలు ఈ కవితల్లో వున్నాయి. భావాన్ని యధాతధంగానే అనువదించినా, కొన్ని చోట్ల తెలుగు దనం చేర్చారు. ఇంగ్లీషు కవిత్వానికి అవసరమైన 'మాత్రల్ని' వదిలి, వీలైన చోట్ల అంత్యప్రాసల్ని చేర్చారు.
ఈ కవితల్ని కళ్ళతో చదవకండి. మనసుతో చదవండి. కొన్ని వాక్యాల్ని మనల్ని నిలబెట్టేస్తాయి. ఆ కవులు ఎంత మధనపడి, ఎంతచిన్న వాక్యాలలో ఎంత పెద్ద భావాల్ని పొదిగారో అర్ధమవుతుంది.