వేద వాఙ్మయంలో దాగిన సృష్టితత్త్వాన్ని కథారూపంగా వివరించడానికి అష్టాదశ పురణాలను రచించాడు వ్యాసమహర్షి. మానవాభ్యుదయం కోసం వెలువడిన ఈ పురాణ వాఙ్మయసారాన్ని సంక్షిప్తంగా సంకలనం చేసి అందిస్తే, ఈనాటి సమాజానికి శ్రేయస్సు కలుగుతుందని సంకల్పించాడు మా శిష్యమిత్రుడు డా. జయంతి చక్రవర్తి. తన ఓర్పు నేర్పులతో అష్టాదశ పురాణాల ఆంతర్యాన్ని వాడుక భాషలో నేటి జనసమాన్యానికి అందుబాటులోకి తెచ్చే పవిత్రమైన బాధ్యతను నెరవేర్చాడు.
పురాణ వాఙ్మయంలోని పుణ్యకథా విశేషాలను ఈనాటి సమాజానికి పంచే కృషిలో పాలుపంచుకుంటున్న మా చక్రవర్తి, సంప్రదాయ సాహిత్యాన్ని ప్రచురించే సత్కార్యాన్ని మహాయజ్ఞంగా స్వీకరించిన ప్రచురణకర్త శ్రీ బాలాజీ పబ్లికేషన్స్ వారు ఎంతైనా అభినందనీయులు.
- మల్లాప్రగడ శ్రీమన్నారాయణమూర్తి
* * *
అష్టాదశ పురాణాలలో ఎనిమిదవది శ్రీ అగ్ని మహాపురాణం. "వామోహ్యాగ్నేయముచ్యతే" అన్న మాట ప్రకారం శ్రీ మహా విష్ణువుకి ఎడమ పాదంగా ఈ పురాణం వర్ణించబడుతోంది. ఈ పురాణంలో మొత్తం 383 అధ్యాయాలు. ప్రస్తుతం లభిస్తున్న ప్రతిలో 12000 శ్లోకాలున్నాయి. ఈ పురాణంలో ఎన్నో ధార్మిక విషయాలతో పాటు ఆగమ, శిల్పశాస్త్ర, మంత్ర, తంత్ర, జ్యోతిషవిజ్ఞానానికి సంబంధించిన విశేషాలు, ఆయుర్వేదానికి, ఆరోగ్యానికి సంబంధించిన విశేషాలు అలాగే నగర, గ్రామ, తటాక, ఆలయ ప్రతిష్ఠా పద్ధతులు.. ఇలా ఎన్నో అంశాలు ఉన్నాయి.