వేద వాఙ్మయంలో దాగిన సృష్టితత్త్వాన్ని కథారూపంగా వివరించడానికి అష్టాదశ పురణాలను రచించాడు వ్యాసమహర్షి. మానవాభ్యుదయం కోసం వెలువడిన ఈ పురాణ వాఙ్మయసారాన్ని సంక్షిప్తంగా సంకలనం చేసి అందిస్తే, ఈనాటి సమాజానికి శ్రేయస్సు కలుగుతుందని సంకల్పించాడు మా శిష్యమిత్రుడు డా. జయంతి చక్రవర్తి. తన ఓర్పు నేర్పులతో అష్టాదశ పురాణాల ఆంతర్యాన్ని వాడుక భాషలో నేటి జనసమాన్యానికి అందుబాటులోకి తెచ్చే పవిత్రమైన బాధ్యతను నెరవేర్చాడు.
పురాణ వాఙ్మయంలోని పుణ్యకథా విశేషాలను ఈనాటి సమాజానికి పంచే కృషిలో పాలుపంచుకుంటున్న మా చక్రవర్తి, సంప్రదాయ సాహిత్యాన్ని ప్రచురించే సత్కార్యాన్ని మహాయజ్ఞంగా స్వీకరించిన ప్రచురణకర్త శ్రీ బాలాజీ పబ్లికేషన్స్ వారు ఎంతైనా అభినందనీయులు.
- మల్లాప్రగడ శ్రీమన్నారాయణమూర్తి
* * *
అష్టాదశ పురాణాలలో ఆరవది నారద పురాణం. పురాణ పురుషుడైన శ్రీ మహా విష్ణువుకి నాభి స్థానంగా వర్ణించబడింది ఈ పురాణం. ఈ పురాణం పూర్వభాగం, ఉత్తరభాగం అని రెండు భాగాలుగా విభజించబడింది. వీటిలో పూర్వభాగం తిరిగి నాలుగు పాదాలుగా 125 అధ్యాయాలుగా విభజించబడగా, ఉత్తర భాగంలో 82 అధ్యాయాలున్నాయి. ఇలా మొత్తం ఈ పురాణం 207 అధ్యాయాలతో 25000 శ్లోకాలతో రచించబడింది. నారద పురాణం శివకేశవులకి సమానమైన ప్రాధాన్యతనిస్తూ శివకేశవుల అభేదతత్త్వాన్ని ప్రబోధిస్తుంది.
- ప్రకాశకులు