భగవాన్ వేదవ్యాస మహర్షి రచించిన పురాణంలో శివమహాపురాణం ఎంతో విశిష్ఠమైనది. పరమేశ్వర తత్త్వాన్ని , పరమేశ్వరుడి లీలల్ని విస్తృతంగా వర్ణించిన ఈ పురాణం, అష్టాదశ పురాణాలలో వాయుపురాణ స్థానంలో వుంటుందని కొందరు అభిప్రాయపడతారు. అయితే అష్టాదశ పురాణాలను గురించి చెప్పే శ్లోకాలలో ఈ పురాణం ప్రస్తావన కనిపించదు కనుక శివ మహాపురాణాన్ని స్వతంత్ర పురాణంగానే ఎక్కువమంది పరిగణిస్తారు.
శివమహాపురాణం సుమారు 26 వేల శ్లోకాలతో రచించబడ్డ బృహద్గ్రంథం. ఇందులో మొత్తం ఏడు సంహితలున్నాయి. 1.విద్యేశ్వరసంహిత 2.రుద్రసంహిత 3.శతరుద్రసంహిత 4.కోటి రుద్ర సంహిత 5.ఉమాసంహిత 6.కైలాససంహిత 7.వాయుసంహిత అనేవి. ఈ ఏడు సంహితల్లో శివసిద్ధాంతం ఎన్నో ఉపాఖ్యానాలు, స్తోత్రాలు, శివలింగాల చరిత్రలు, తదితర విశేసాలు సవివరంగా చెప్పబడ్డాయి. శైవ సంప్రదాయానికి సంబంధించిన సకల విజ్ఞాన సర్వస్వం ఈ శివపురాణం.